శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మరణశిక్ష ఖైదీలను నొప్పి లేకుండా చంపలేరా? సుప్రీంకోర్టు ప్రశ్న

hang
కఠినమైన నేరాల్లో మరణశిక్ష పడిన ఖైదీలను నొప్పి లేకుండా, బాధ కలగకుండా చంపలేరా అంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరణ దండన అమలులో భాగంగా ఖైదీలకు ఉరి వేసే చంపాలా అని అడిగింది. ఈ తరహా శిక్షల అమలులో నొప్పి లేకుండా మరణించే ప్రత్యామ్నాయ పద్ధతులు లేవా? ఈ విషయంపై దృష్టిసారించండి అని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఖైదీల మెడకు ఉరితాడు బిగించి చంపేసే క్రూరమై పద్ధతి కాకుండా, తక్కువ నొప్పితో మరణశిక్షను అమలుచేసే విధానాలపై చర్చించి సమాచారాన్ని సేకరించాలని కోరింది. 
 
ఉరిశిక్షలను ఎదుర్కొనే ముద్దాయిలకు నొప్పి లేకుండా చనిపోయే అవకాశం కల్పించాలంటూ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సూచన చేసింది. మరణశిక్ష పడిన ఖైదీలను తుపాకీతో కాల్చి చంపడం, విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, విద్యుదాఘాతం లేదా గ్యాస్ చాంబర్ ద్వారా చంపే విధానాలను పరిశీలించవచ్చన్న న్యాయ కమిషన్ నివేదికను పిటిషనర్ ప్రస్తావించారు. 
 
పైగా, ఇతర దేశాల్లో కూడా ఉరివేసే విధానాన్ని క్రమంగా నిలిపివేస్తున్నారని, అందువల్ల భారత్‌లో కూడా ప్రత్యామ్నాయం చూడాలని సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం ఉరికి ప్రత్యామ్నాయం కనుగొనాలని సూచించారు.