శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:24 IST)

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం.. ఆపై తాళి కట్టి కాపురం చేయాలంటూ ఒత్తిడి

తన కుమారుడు ప్రేమించిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా తాళికట్టి.. తనతో కాపురం చేయాలంటూ చిత్ర హింసలకు గురిచేశాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్ణణం జిల్లా వేదారణ్యం సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వేదారణ్యం సమీపంలోని సెంబోడై అనే గ్రామానికి చెందిన ముఖేశ్ కన్నన్ (20) అనే యువకుడు ఐటీఐ చదువుతున్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి, తమ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. అయితే, ఈ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు సమ్మతించలేదు. అలాగే, ముఖేశ్ కన్నన్ తండ్రి నిత్యానందన్ (42) కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, ముఖేశ్ కన్నన్ మాత్రం ఈ పెళ్లి జరిపించి తీరాల్సిందేనని, లేనిపక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రిని బెదిరించాడు. దీంతో నిత్యానందన్ ఈ పెళ్లిని ఎలాగైనా అపించాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
తన ప్లానులో భాగంగా ఆ యువతి ఇంటికెళ్లిన నిత్యానందన్... తన కుమారుడితో పెళ్లి జరిపిస్తానని నమ్మించి తనతో రావాలంటూ విజ్ఞప్తి చేశాడు. అతని మాటలను నమ్మిన యువతి... అతనితో కలిసి బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో జనసంచారం లేని ప్రాంతంలో ఆ యువతిపై నిత్యానందన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెకు బలవంతంగా తాళికట్టి, పిమ్మట ఆ యువతిని తీసుకెళ్లి అవరిక్కాడులోని తన స్నేహితుడు శక్తివేలు ఇంట్లో నిర్బంధించాడు. 
 
ఇకపై తనతోనే కాపురం చేయాలని లేనిపక్షంలో చంపేస్తానంటూ బెదిరించసాగాడు. అదేసమయంలో తన కుమారుడిని పిలిచి.. ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకోబోతుందని నమ్మించాడు. ఇంతలో శక్తివేల్ ఇంట్లో నిర్బంధంలో ఉన్న ఆ యువతి తప్పించుకుని వేదారణ్యం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.