గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (17:42 IST)

జీవితంలో గవర్నర్ గిరి కొత్త అధ్యాయం : బండారు దత్తాత్రేయ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేయడం తన జీవితంలో కొత్త అధ్యాయమని బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన బుధవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అంకితభావంతో పని చేశాను. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను. పర్యాటకంలో దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తాం. బడుగు, బలహీన, కార్మిక వర్గాలకు లబ్ది చేకూరేలా ప్రయత్నిస్తాను. అధికార, విపక్షాలను కలుపుకుని హిమాచల్‌ప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తాను. విద్య, అడవులు, ప్రకృతి, గిరిజనుల అంశాలపై కృషి చేస్తాను. రాజ్యాంగ పదవి చేపట్టిన తాను రాజకీయాల గురించి మాట్లాడబోను' అని చెప్పుకొచ్చారు.
 
అంతకుముందు... బండారు దత్తాత్రేయతో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
 
ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్ మంగళవారం నూతన గవర్నర్‌కు అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా క్యాప్‌ను ధరించి దత్తాత్రేయ ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు దత్తాత్రేయకు ఘనస్వాగతం పలికారు. 
 
72 యేళ్ల బండారు దత్తాత్రేయ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహరీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంతో పాటు... ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో 2014లో ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. కాగా, గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా కల్‌రాజ్ మిశ్రా ఉండగా, ఆయన్ను రాజస్థాన్ రాష్ట్రానికి బదిలీ చేసి, ఆయన స్థానంలో బండారు దత్తాత్రేయను కేంద్రం నియమించింది.