1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (11:58 IST)

గుజరాత్‌లో అమానవీయం : బాలికకు గుండు కొట్టించి ఊరేగింపు.. ఎందుకు?

గుజరాత్ రాష్ట్రంలో అమానవీయ సంఘటన ఒకటి జరిగింది. తాను ప్రేమించిన యువకుడితో లేచి పోయేందుకు ప్రయత్నించిన ఓ మైనర్ బాలికను పట్టుకుని గుండు కొట్టించి గ్రామంలో ఊరేగించారు. కేవలం గుండు మాత్రమే కాకుండా ముఖానికి నల్లటి రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో శుక్రవారం జరుగగా పోలీసులు శనివారం వివరాలను వెల్లడించారు. 
 
బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. 
 
ఈ ఘటనకు సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేశామని, 22 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరోవైపు తమ బాలికను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలిక ప్రియుడిపైనా కేసు నమోదైంది.