1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మధ్యప్రదేశ్‌లో దారుణం : సంతానం కోసం వేశ్య నరబలి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సంతానం కోసం భూతవైద్యుడి మాటలు నమ్మిన ఓ వ్యక్తి ఒక వేశ్యను నరబలి ఇచ్చాడు. ఆలస్యంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్వాలియర్‌లో నివసించే బంటు, మమతా దంపతులకు 18 ఏళ్ల కిందట పెళ్లయినా, ఇప్పటికీ పిల్లలు కలగలేదు. వారి కుటుంబ స్నేహితుడు నీరజ్ పర్మార్ సలహా మేరకు ఓ భూతవైద్యుడ్ని సంప్రదించారు. ఆ భూతవైద్యుడి పేరు గిర్వార్ యాదవ్. పిల్లలు పుట్టాలంటే నరబలి ఒక్కటే మార్గమని అతడు చెప్పడంతో బంటు, మమత సరేనన్నారు.
 
బలి ఇచ్చేందుకు తగిన వ్యక్తిని తీసుకువచ్చే బాధ్యతను వారు నీరజ్ పర్మార్‌కు అప్పగించారు. నీరజ్ ఓ వేశ్యను తీసుకురాగా, ఆమెను బలిచ్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్‌పై తరలించే ప్రయత్నంలో కిందపడిపోవడంతో నీరజ్ భయపడ్డాడు. 
 
దాంతో ఆ వేశ్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకువచ్చి భూత వైద్యుడి సమక్షంలో బలి ఇచ్చారు. వీరు మొదట బలి ఇచ్చిన వేశ్య మృతదేహం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ఆరంభించగా, నరబలి వ్యవహారం బట్టబయలైంది.
 
నీరజ్ పర్మార్‌ను అరెస్టు చేసి ప్రశ్నించగా, విషయం మొత్తం చెప్పేశాడు. దాంతో బంటు, మమతా దంపతులతో పాటు భూతవైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలోనూ మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో ఇలాంటి ఘాతుకాలు జరగడం బాధాకరం.