శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (10:43 IST)

కరోనాపై సాగుతున్న పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న హీరోలు!

కరోనా వైరస్ మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్నది వైద్యులే. అయితే, ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారిలో వైద్యులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా దేశం వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 382గా ఉందని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ తెలిపింది. 
 
అయితే, దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పార్లమెంట్ లో ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఈ పోరాటంలో ముందు నిలిచి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వైద్యుల గురించిన ప్రస్తావన చేయకపోవడం, ఆరోగ్య పరిరక్షణ రాష్ట్రాల బాధ్యతైనందున తమ వద్ద పూర్తి సమాచారం లేదని ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ దూబే వ్యాఖ్యానించడాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. 
 
1897 ఎపిడెమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లను నిర్వహించే నైతిక హక్కును కేంద్రం కోల్పోయిందని మండిపడింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 382 మంది వైద్యులు మృతి చెందారని వెల్లడించిన ఐఎంఏ, 27 ఏళ్ల వయసు నుంచి 85 సంవత్సరాల వయసులోనూ వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వరకూ ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. 
 
ఇదే అంశంపై ఐఎంఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో అశ్విని కుమార్ దూబే మాటలు, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకేనని ఆరోపించింది. ప్రజారోగ్యం, ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోనివి కావడంతో, తమ వద్ద పరిహారం గణాంకాలు, ఇతర లెక్కలు లేవని మంత్రి పేర్కొనడం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు.