భారత నౌకాదళంలో చేరిన మరో యుద్దనౌక 'అండ్రోత్'
భారత నౌకాదళంలో మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. ఈ యుద్ధ నౌక పేరు అండ్రోత్. తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని ఇట్టే పసిగడుతుంది. ఈ నౌకను సోమవారం విశాఖ నేవల్ డక్ యార్డులో జలప్రవేశం చేయించారు. విశాఖ డక్ యార్డులోని 'యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో జలప్రవేశం చేసింది. నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్ ఆధ్వర్యంలో దీన్ని కమిషనింగ్ చేశారు. భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయిగా నిలిచింది.
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలోని ప్రభుత్వరంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) ఈ నౌకను తయారు చేసింది. ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధనౌక. మొదటిది ఐఎన్ఎస్ అర్నాలా. అది జూన్ 18న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది. లక్షదీవుల్లోని అండ్రోత్ అనే దీవి పేరును రెండో యుద్ధనౌకకు ఖరారు చేశారు.
అండ్రోత్ యుద్ధ నౌకలో దేశీయంగా రూపొందించిన 30 ఎంఎం సర్ఫేస్ గన్ ఉంది. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది. ఇందులో ఎనిమిదింటిని జీఆర్ఎస్ఈ ఉత్పత్తి చేస్తోంది. తీర ప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి ఉంది. విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాములను వేటాడగలవు. అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం. ఈ యుద్ధనౌకల్లో తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి.