శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (10:43 IST)

ఇందిరాగాంధీ వర్థంతి.. కారాగారంలో ఉండగానే ఆమెకు మగ పిల్లాడు.. పేరు రాజీవ్...!

Indira Gandhi
Indira Gandhi
శ్రీమ‌తి ఇందిరాగాంధీ వర్థంతి నేడు. 1917 న‌వంబ‌ర్ 19న జ‌న్మించిన శ్రీమ‌తి ఇందిరాగాంధీ స్వ‌తంత్య్ర భార‌త తొలి ప్ర‌ధాని పండిట్‌ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకున్న ఆమె..  అనేక అంత‌ర్జాతీయ విశ్వ‌విద్యాల‌యాల నుంచి గౌర‌వ డాక్ట‌రేట్ డిగ్రీలు పొందారు. 
 
అలాగే కొలంబియా యూనివ‌ర్శిటీ నుంచి విశిష్ట ప్ర‌శంసా ప‌త్రం అందుకున్నారు. సాతంత్య్ర పోరాటంలో ఇందిరాగాంధీ చురుకుగా పాల్గొన్నారు. బాల్యంలో ఆమె "బాల్ చ‌ర‌ఖా సంఘ్" స్థాపించారు. 1930లో స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మంలో కాంగ్రెస్ పార్టీకి స‌హాయంగా ఉండేందుకు పిల్ల‌ల‌తో క‌ల‌సి "వాన‌ర్‌ సేన" ఏర్పాటుచేశారు. 1942 సెప్టెంబ‌ర్‌లో జైలుకు వెళ్ళారు. 1947లో ఢిల్లీలో అల్ల‌ర్ల‌కు గురైన ప్రాంతాల్లో సేవా కార్య‌క్ర‌మాల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. 
 
ఇందిరాగాంధీ 1942 మార్చి 26న ఫిరోజ్‌గాంధీని వివాహ‌మాడారు. ఆమెకు ఇద్ద‌రు కుమారులు. 1955లో కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ, పార్టీ ఎన్నిక‌ల క‌మిటీల‌లో స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయింది. జవహర్‌లాల్ నెహ్రూ కారాగారం నుండి విడుదల అవుతూనే మళ్ళీ అరెస్టు అయ్యారు. గాంధీజీ కూడా అరెస్టు అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. 
 
అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేసారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు అయి కారాగారానికి వెళ్ళి 1943 మే 13న విడుదలయ్యారు. కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి అయింది. ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టారు. 
 
1958లో కాంగ్రెస్ కేంద్ర పార్ల‌మెంట‌రీ బోర్డు స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు. ఏఐసిసి జాతీయ స‌మ‌గ్ర‌తా మండ‌లి ఛైర్ ప‌ర్స‌న్‌గాను, 1956లో అఖిల భార‌త యువ‌జ‌న కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గాను ప‌నిచేశారు. 1959లో భార‌త జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టి 1960 వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు. 1978లో మ‌ళ్ళీ అదే ప‌ద‌విని చేప‌ట్టారు.
 
1964 నుంచి 1966 వ‌ర‌కు స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రిగా ఉన్నారు. 1966 జ‌న‌వ‌రి నుంచి 1977 మార్చి వ‌ర‌కు భార‌త అత్యున్న‌త ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అలంక‌రించారు. ఇదే కాలంలో 1967 సెప్టెంబ‌ర్ నుంచి 1977 మార్చి వ‌ర‌కు అణు ఇంధ‌న శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 
 
1967 సెప్టెంబ‌ర్ 5 నుంచి 1969 ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 1970 జూన్ నుంచి 1973 న‌వంబ‌ర్ వ‌ర‌కు హోం మంత్రిత్వ‌శాఖ‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. 1972 జూన్ నుంచి 1977 మార్చి వ‌ర‌కు అంత‌రిక్ష వ్య‌వ‌హారాల మంత్రిగా ప‌నిచేశారు. 1980 జ‌న‌వ‌రి నుంచి ప్ర‌ణాళికా సంఘం ఛైర్ ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. 1980 జ‌న‌వ‌రి 14న మ‌ళ్ళీ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు.
Indira Gandhi
Indira Gandhi
 
1964 ఆగ‌స్టులో రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ 1967 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ప‌నిచేశారు. నాలుగు, ఐదు, ఆరు లోక్‌స‌భ‌లో ఆమె స‌భ్యురాలిగా ఉన్నారు. ఏడ‌వ 1980లో లోక్ స‌భ‌కు ఆమె రాయ్ బ‌రేలీ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌), మెద‌క్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌) నుంచి ఎన్నిక‌య్యారు. త‌రువాత మెద‌క్ స్థానాన్ని ఉంచుకుని రాయ్ బ‌రేలీ స్థానాన్ని వ‌దులుకున్నారు. 1967-77లోను తిరిగి 1980లోను కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఎన్నిక‌య్యారు.
 
విభిన్న‌మైన విస్తృతాంశాల ప‌ట్ల ఆస‌క్తి క‌లిగిన ఇందిరాగాంధీ జీవితం ప‌ట్ల స‌మ‌గ్ర దృక్ప‌థం క‌లిగి ఉండేవారు. శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. 
 
ఇందిరాగాంధీ ప్ర‌ముఖ ర‌చ‌న‌ల్లో "ఇయ‌ర్స్ ఆఫ్ ఛాలెంజ్" (1966-69) , "ఇయ‌ర్స్ ఆఫ్ ఎన్డీవ‌ర్" (1969-72), "ఇండియా" (లండ‌న్‌) (1975), ఇండే లాస‌న్నే(1979) మొద‌లైన‌వి ఉన్నాయి. ఇంకా అసంఖ్యాక‌మైన సంక‌ల‌నాలు, ప్ర‌సంగాలు, ర‌చ‌న‌లు వెలువ‌రించారు.
 
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సోమవారం ఆమెకు నివాళులర్పించింది. ఆమె చూపిన ప్రేమను, ఆచరించిన విలువలను తన గుండెల్లో నింపుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఇందిరా గాంధీ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, ఈ దేశం విచ్ఛిన్నం కానివ్వనని రాహుల్ గాంధీ అన్నారు.
 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర పార్టీ సీనియర్ నేతలు ఇందిరా గాంధీ శక్తి స్థల్ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
"భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమరులైన రోజు సందర్భంగా ఆమెకు నా నివాళులు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ లేదా సైనిక శక్తి ఏదైనా సరే, భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఇందిరాజీ చేసిన కృషి సాటిలేనిది" అని ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు.