శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (18:01 IST)

రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న గదిలో సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదా? లాఠీలతో కొట్టారా?

చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో తిరునల్వేలి జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామంలోని అతని ఇంట్లోనే రామ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో రామ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్లేడుతో గొంతు కోసుకునేందుకు యత్నించి విఫలమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రామ్ కుమార్‌ను చెన్నై శివారు ప్రాంతంలోని పుళల్ కేంద్ర కారాగారంలోని ప్రత్యేక గదిలో బంధించారు. 
 
అయితే, రామ్‌ కుమార్ జైల్లోని విద్యుత్ వైర్లు నోటితో పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు సిబ్బంది చెపుతున్నారు. ఈ విద్యుదాఘాతంలో గాయపడిన రామ్ కుమార్‌ను తొలుత జైలు ఆస్పత్రి... ఆ తర్వాత రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని స్వాతి హత్య కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారి శంకర్ ధ్రువీకరించారు.
 
కాగా, రామ్‌కుమార్ లాయర్ రామరాజన్ మాత్రం జైల్లోనే రామ్‌కుమార్‌ను హత్య చేసినట్టు ఆరోపించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన మీడియాతో చెప్పారు. జూన్ 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతిని నరికి చంపాడనే అభియోగంపై జూలై ఒకటో తేదీన రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

అయితే, పుళల్ కేంద్ర కారాగారంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పైగా, జైలు గదుల్లో ఎక్కడా కూడా విద్యుత్ వైర్లు చేతికి అందేంత ఎత్తులో ఉండవు. పైగా, అధికారులు నిత్యం పహారా కాస్తుంటారు. అలా కట్టుదిట్టమైన భద్రత ఉన్న పుళల్ సెంట్రల్ జైలులో రామ్ కుమార్ విద్యుత్ వైర్లు ఎలా పట్టుకున్నాడు.. వాటిని ఎలా నోటితో కొరికాడన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
మరోవైపు.. తన కుమారుడిని జైల్లోనే హత్య చేశారని రామ్ కుమార్ తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో జైలులో రామ్ కుమార్ మరణించాలనే అనేక మార్పులు చేసినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట రామ్ కుమార్ హత్య చేసుకోవడానికి ఉపయోగించబడిన విద్యుత్ బాక్స్ పాతబడిపోవడంతో దానిని తెరిచి ఉంచామని.. ఆ విద్యుత్ వైరు ద్వారా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

రామ్ కుమార్ శరీరంలో గాయాల గురించి స్పందించిన జైలు అధికారి విద్యుత్ ఘాతంలో చిక్కుకున్న అతడిని కాపాడే నేపథ్యంలోనే లాఠీతో కొట్టామని తెలిపారు. అంతేకాదు అతడు ఆత్మహత్య చేసుకున్న గదిలో సిసిటివి కెమెరాలు పనిచేయలేదని అన్నారు. ఇలా తాజాగా అందిన సమాచారాలు పలు అనుమానాలకు దారితీస్తోంది.