గురువారం, 13 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (11:53 IST)

సీఎం పన్నీర్‌సెల్వం అనుమతితో రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ సోదాలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అనుమతితోనే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేయడం గమనార్హం. ఆయన వద్ద అనుమతి తీసుకున్న తర్వాతే రామ్మోహ

తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అనుమతితోనే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేయడం గమనార్హం. ఆయన వద్ద అనుమతి తీసుకున్న తర్వాతే రామ్మోహన్ రావు నివాసాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేశారు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ఆర్థికశాఖ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులతో అత్యవసర చర్చలు జరిపారు. కానీ, ప్రతిరోజూ సీఎం వెంట వచ్చే పలువురు మంత్రుల వాహనాలు బుధవారం కనిపించలేదు. 
 
మరోవైపు... ఐటీ అధికారులు సీఎస్‌ కార్యాలయానికి రావడానికి ముందుగానే ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం మీడియా సమావేశం ఉంటుందని ‘లీక్‌’ వచ్చినప్పటికీ... అదేదీ జరగలేదు. 
 
కాగా, తమిళనాడు సచివాలయంలో 2వ అంతస్తులో ఉన్న సీఎస్‌ కార్యాలయం వద్దకు ఐటీ అధికారులు భద్రతా బలగాలను వెంటబెట్టుకుని రావడంతో ‘ఏదో జరిగిందంటూ’ కలకలం రేగింది. పలువురు ఐఏఎస్‌ అధికారులు సచివాలయం వదిలి వెళ్లిపోయారు. వరుసగా బుగ్గ కార్లు బయటకు పరుగులు పెడుతుండడంతో ఏం జరుగుతుందో అర్థంగాక ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు.