1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (08:54 IST)

బీహార్ వృద్ధుడి ఖాతాలోకి రూ.52 కోట్లు జమ?

ఇటీవలి కాలంలో పలువురి బ్యాంకు ఖాతాల్లోకి ఉచితంగానే డబ్బు వచ్చి జమఅవుతోంది. మొన్నటికిమొన్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లోకి రూ.960 కోట్లు జమ అయింది. ఇపుడు ఇదే రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడి ఖాతాలోకి రూ.52 కోట్లు జమ అయ్యాయి. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చి జమ అయిందో తెలియదు. 
 
ఈ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా పింఛన్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్‌ కోసం బ్యాంకుకు వెళ్లాడు. 
 
ఈ క్రమంలో ఖాతాలో సొమ్ము నిల్వ ఎంతుందో చెక్‌ చేయాలని అక్కడి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ (సీఎస్‌పీ) అధికారిని కోరగా.. ఖాతా చెక్‌ చేస్తే అందులో రూ.52 కోట్లు ఉన్నట్లు చూపించింది. అంతమొత్తం ఉండడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలీదని బహుదూర్‌ షా చెప్పుకొచ్చాడు.
 
ఇదే తరహాలో పెద్ద మొత్తంలో ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న ఉదంతాలు వెలుగుచూసినప్పుడు ఆయా ఖాతాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. డబ్బు ఉపసంహరించుకోకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో తన ఖాతాలో పడిన సొమ్ములో ఎంతో కొంత తనకిస్తే బతికేస్తానని రామ్‌ బహుదూర్‌ షా బ్యాంకు అధికారులను కోరుతున్నారు. 
 
'వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం సాఫీగా సాగిపోతుంది' అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. అంతకుముందు బిహార్‌కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవల పొరపాటున రూ.5.5 లక్షలు జమవగా, తనకు ప్రధాని మోడీ ఇచ్చారంటూ వెనక్కి ఇచ్చేందుకు అతడు నిరాకరించడం గమనార్హం.