ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2016 (09:58 IST)

జయలలిత 16 ఏళ్ల క్రితమే వీలునామా రాసేశారట.. రక్తసంబంధీకురాలిపైనే అంతా రాశారట..?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో ఆమె ఆస్తులకు ఏమౌతాయనే అనుమానాలు వెల్లువెత్తాయి. జయలలిత వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? అనేదానిపై చర్చ సాగింది. ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో ఆమె ఆస్తులకు ఏమౌతాయనే అనుమానాలు వెల్లువెత్తాయి. జయలలిత వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? అనేదానిపై చర్చ సాగింది. ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే వీలునామా రాశారా? అని జయలలిత మరణం తర్వాత పలు అనుమానాలు తలెత్తాయి. వీటిన్నింటికి సమాధానం దొరికింది.

16 ఏళ్ల కిందటే జయ తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్‌ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్‌ చేశారు.
 
వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి మాత్రం తెలియజేసే వీలులేదని సమాచారం. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం 'బుక్‌ 3'లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్‌ హెయిర్‌)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు వీలు కాదని పేర్కొంటున్నారు. వీలునామాతోపాటు రెండు ట్రస్ట్‌లను కూడా జయలలిత 2000 జూలై 14న రిజిస్ట్రేషన్‌ చేశారని తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా హైదరాబాద్‌ నగర శివారులోని జేజే గార్డెన్స్‌లో జరిగింది.
 
నాడు జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్‌(పేట్‌ బషీరాబాద్‌)లోని తన గార్డెన్స్‌ చిరునామాతో చేయించారు. 'పురట్చి తలైవి బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్, నమద్‌ ఎంజీఆర్‌ బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌'లను (డాక్యుమెంట్‌ నంబర్లు బుక్‌ 4లో 31, 32) రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ ట్రస్టుల నిర్వాహకులుగా జయలలిత తన పేరుతోపాటు తన నెచ్చెలి శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను చేర్చారు. ఆపై 2001లో ట్రస్ట్‌ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేశారు.
 
నాడు మేడ్చల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకొని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ పదవీ విరమణ చేసినప్పటికీ జయలలిత ఆస్తుల కేసు విచారణ సమయంలో పలుమార్లు సీబీఐ, న్యాయస్థానాల ఎదుట హాజరైనట్లు తెలిసింది.