బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (09:39 IST)

రాజస్థాన్ రాష్ట్రంలో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్..

derailed
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. సూర్య నగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ చనిపోలేదు. కానీ పది మందికి గాయాలయ్యాయి. ప్రాణనష్టం లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంద్రా టెర్మినల్ నుంచి జోధ్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్ డివిజన్‌ పరిధిలోని రాజ్‌కియావస్ - బోమద్ర స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి.. సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 
 
మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికో రైలులో భారీ కుదుపు లాంటి శబ్ధం వచ్చిందని, ఆ తర్వాత రెండు మూడు నిమిషాలకే రైలు ఆగిపోయిందని ఆ రైలులో ప్రయాణం చేసిన ఓ ప్రయాణికుడు చెప్పాడు. కిందికి దిగి చూస్తే మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని వివరించాడు.