రష్మికకు బుద్ధి చెబుతామంటున్న కాంగ్రెస్ నేతలు.. ఎందుకు?
హీరోయిన్ రష్మిక మందన్నాకు తగిన బుద్ధి చెబుతామని కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమెను ఆహ్వానించినప్పటికీ ఆమె హాజరుకావడం లేదని, వివిధ భాషల్లో నటిస్తూ కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక తాను హైదరాబాద్ అని చెప్పుకోవడమేమిటని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టుగా చిత్రపరిశ్రమ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సి ఉందని ఆయన అన్నారు.
"కిరిక్ పార్టీ" అనే కన్నడ మూవీతో కన్నడ చిత్రసీమలో రష్మిక తన సినీ కెరీర్ను ప్రారంభించారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరుకావాలని గత యేడాది ఆమెను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించగా, ఆమె అందుకు అంగీకరించకపోగా, తాను రాలేనని, కర్నాటకకు వచ్చేంత సమయం తనకు లేదని చెప్పారని తెలిపారు. తన ఇల్లు హైదరాబాద్ నగరంలో ఉందని, కర్నాటక ఎక్కడో తనకు తెలియదు అన్నట్లుగా మాట్లాడరాని, కన్నడ భాష, సినీ ఇండస్ట్రీ పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తుందని, ఆమెకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మరోవైపు, రాష్ట్ర రాజధాని బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో కన్నడ నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు ఒకే తాటిపైకి రావాలని రాష్ట్రంలో జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఒకవేళ వారు రాకపోతే, ఈ ఫెస్టివల్ ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. చిత్రపరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఎంతో కీలకమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అప్పటికీ వారు తీరుమారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు బాగా తెలుసని హెచ్చరించారు.