1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (10:15 IST)

ఉగ్రవాది కసబ్ లాయర్లకు ఫీజు చెల్లించని మహారాష్ట్ర సర్కారు...

నవంబరు 26 (26/11 కేసు) ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోకి 10 మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఇది జరిగి సోమవారానికి పదేళ్లు గడిచింది. ఈ దాడిలో దాదాపు సుమారుగా 175 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్తినష్టం భారీగా జరిగింది. 
 
ఈ మారణహోమానికి పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా బలగాలు ముట్టుబెట్టగా, కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో కసబ్‌కు ఉరిశిక్ష విధించింది. దీంతో 2012లో కసబ్‌ను పూణెలోని ఎర్రవాడ జైలులో ఉరితీశారు. అయితే, ఈ కేసులో కసబ్ తరపున వాదించిన అమిన్ సోల్కర్, ఫర్హానాలకు ఫీజు మాత్రం ఇంకా చెల్లించలేదు. 
 
కసబ్ తరపున వాదించినందుకు అమిన్‌కు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అందే అంత ఫీజు, అసిస్టెంట్‌ ప్రాసిక్యూటర్‌ స్థాయి ఫీజు ఫర్హానాకు చెల్లించాలని మహారాష్ట్ర సర్కారును బాంబే హైకోర్టు ఆదేశించింది. కానీ, ఇప్పటివరకు వారికి ఫీజు అందలేదు. 'కోర్టు తీర్పు ఇచ్చి ఏడేళ్లైంది. దోషిని ఉరితీశారు. కానీ, ఫీజులు మాత్రం మా చేతికి రాలేదు' అని అమిన్, ఫర్హానాలు వాపోతున్నారు. తనకు చెల్లించాల్సిన బకాయిలు రాబట్టుకునేందుకు చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.