1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (12:08 IST)

నుపుర్ శర్మకు లుక్‌ ఔట్ నోటీసులు జారీ

Nupur sharma
మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి, బహిష్కృత మహిళా నేత నుపుర్‌శర్మ వరుసగా నాలుగోసారి కూడా తమ ఎదుట హాజరు కాకపోవడంతో కోల్‌కతా పోలీసులు శనివారం లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారు. అలాగే, ఆమె కోసం అన్ని వైపుల గాలిస్తున్నారు. దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలను పోలీసులు అలెర్ట్ చేశారు. 
 
మరోవైపు, ఉదయ్‌పుర్‌ దర్జీ కన్హయ్య లాల్‌ హత్య తరహాలోనే మహారాష్ట్రలోనూ ఓ మందుల దుకాణం యజమాని(కెమిస్ట్‌)ని నరికి చంపివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహమ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా భాజపా బహిష్కృత నేత నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అమరావతి జిల్లాలో మందుల షాపు నిర్వహిస్తున్న ఉమేశ్‌ ప్రహ్లాద్‌రావు కోల్హే(54) గత నెల 21న రాత్రి పది గంటల సమయంలో తన దుకాణం మూసివేసి ఇంటికి వెళుతుండగా కొందరు మోటార్‌ బైక్‌పై వెంబడించి కత్తులతో దాడిచేసి నరికి చంపేశారు. తొలుత దీన్ని దోపిడీ కేసుగా పోలీసులు భావించారు. 12 రోజుల విచారణ అనంతరం నుపుర్‌శర్మకు మద్దతుగా ఉమేశ్‌ చేసిన పోస్టే హత్యకు కారణమని తేల్చారు. 
 
హత్యకు పథక రచన చేసిన ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(35) సహా, ముదస్సిర్‌ అహ్మద్‌ (22), షారుక్‌ పఠాన్‌ (25), అబ్దుల్‌ షేక్‌ తస్లీం (24), షోయబ్‌ఖాన్‌ (22), ఆతిబ్‌ రషీద్‌ (22), యూసుఫ్‌ఖాన్‌ (44)లను అరెస్టుచేశారు.