1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (18:13 IST)

బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు : సవతి తండ్రికి కేసు

lailakhan
బాలీవుడ్ నటి లైలా ఖాన్‍‌ హత్య కేసులో ఆమె సవతి తండ్రికి జైలు శిక్షపడిది. ఈ కేసులో సుధీర్ఘ విచారణ జరిగ్గా 13 యేళ్ల తర్వాత శిక్ష పడటం గమనార్హం. గత 2011లో లైలా ఖాన్, ఆమె కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె సవతి తండ్రిని ఇటీవల ముంబై సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా అతడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులకు 13 ఏళ్ల తర్వాత శిక్ష పడటం గమనార్హం.
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 2011 జనవరి 30న లైలా తన తల్లి షెలీనా, నలుగురు సోదరీమణులతో కలిసి నాసిక్‌ జిల్లాలోని ఇగత్‌పురిలో గల తమ ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. ఆ తర్వాత నుంచి వీరంతా కన్పించకుండా పోయారు. దీంతో షెలీనా మొదటి భర్త, లైలా తండ్రి నదీర్‌ షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. షెలీనా మూడో భర్త పర్వేజ్‌ తక్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
 
ఆ మరుసటి ఏడాది 2012 జూన్‌లో పర్వేజ్‌ తక్‌ను జమ్మూకాశ్మీర్‌ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. విచారణ సమయంలో లైలా, ఆమె కుటుంబాన్ని తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. వెంటనే వారు ముంబై పోలీసులకు సమాచారమివ్వగా ఈ సామూహిక హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. షెలీనా, ఆమె పిల్లల ఆస్తులపై కన్నేసిన పర్వేజ్‌ అవి తన పేరు మీద రాయాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు.
 
ఈ ఘటన జరిగిన రోజు కూడా ఫామ్‌హౌస్‌లో ఇదే విషయమై అతడు గొడవ పడ్డాడు. అది తీవ్రమవడంతో షెలీనా తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపాడు. అది చూసిన లైలా, ఆమె సోదరీమణులను సైతం అతి దారుణంగా కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌ నుంచి ఆరుగురి మృతదేహాల అవశేషాలను పోలీసులు బయటకు తీశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. నిందితుడికి లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తెలిసింది. హత్య అనంతరం నేపాల్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జమ్మూకాశ్మీర్‌ పోలీసులకు చిక్కాడు.