1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Made A Mistake : Arvind Kejriwal Admits In SC Over Retweeting Defamatory Video

పరువు నష్టం దావా కేసులో తప్పును అంగీకరించిన సీఎం కేజ్రీవాల్

kejriwal
పరువు నష్టం దావా కేసులో చేసిన తప్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను రీట్వీట్ చేయడంతో కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సమన్లు కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వీడియోను రీట్వీట్ చేయడం పొరబాటేనని చెప్పారు. దీంతో కేజ్రీవాల్‌పై బలవంతపు చర్య తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018లో రూపొందించినట్లు చెబుతున్న ఓ వీడియోను కేజ్రివాల్ రీట్వీట్ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అదేసమయంలో కింది కోర్టు జారీచేసిన సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీంతో కేజీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
కేజ్రివాల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజీవాల్ కోరారు. ఈ మేరకు కేజీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. కేజీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారు సూచనను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఫిర్యాదుదారు తరపు న్యాయవాది రాఘవ్ అవస్తీ సమయాన్ని కోరారు. దీంతో ఈ కేసులో కేజీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.
About Writer
వరుణ్
తర్వాతి కథనం
హనుమ విహారికి అన్యాయం చేసి 'ఆడుదాం ఆంధ్రా'తో లాభమేంటి?: పవన్ ప్రశ్న