గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (08:45 IST)

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 85 యేళ్లు. ఈ విషయాన్ని టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ ధ్రువీకరించారు. 
 
శ్వాసకోశ సమస్యలు, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో గత నెల 11న లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. దీంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు కేంద్రం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. 
 
కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాల్జీ పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించింది. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం మానేసింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఈ ఉదయం కన్నుమూసినట్టు మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. 
 
గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం పెనవేసుకుపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఆయనది ఘనమైన చరిత్ర. మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.