శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (18:03 IST)

వరుడు ఒకరు - ఇద్దరు వధువులు - ఒకే ముహుర్తానికి జరిగిన పెళ్లి!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఒక వరుడు ఇద్దరు వధువులను పెద్దలు కుదిర్చిన ముహూర్తానికే పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వివాహానికి వధువులిద్దరూ సమ్మతించడమేకాకుండా, వారి తల్లిదండ్రులు కూడా అనుమతించారు. అలాగే, వరుడుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో ఈ పెళ్లి సుఖాంతమైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ఘోరాడోంగ్రీ బ్లాక్‌, కెరియా గ్రామానికి చెందిన సందీప్ యుకి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమలోపడ్డాడు. ఈ విషయం తెలియక అతని తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు మరో యువతిని మాట్లాడారు. 
 
అయితే, ఈ విషయం తెలిసిన సందీప్ ప్రియురాలు... గ్రామ పంచాయతీ పెద్దలకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ పెద్దలు మూడు కుటుంబాలను పిలిచి మాట్లాడగా, ఇద్దరు యువతులు కలిసి సందీప్‌ను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. అలాగే, వరుడు కూడా వధువులిద్దరినీ వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో ఒకే ముహూర్తానికి వధువులిద్దరి మెడలో వరుడు తాళికట్టడంతో ఈ విచిత్రమైన పెళ్లి తంతు పూర్తయింది. ఈ వివాహం జూలై 8వ తేదీన ఘనంగా జరిగింది.