గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (11:44 IST)

కుల ద్రోహి - గజదొంగ అంటున్నారు.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా.. ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమానికి నాంది పలికినవారిలో మాజీ మంత్రి, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం మొదటి వ్యక్తి అని చెప్పాలి. ఆయన పుణ్యమానే గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం ప్రజలు బీసీలుగా పరిగణిస్తున్నారు. నిజానికి వీరంతా ఉన్నత కులానికి చెందినవారు. అయితే, కాపుల్లో అనేక మంది పేదలు ఉండటంతో ముఖ్యంగా, గోదావరి జిల్లాల్లో అనేక మంది కాపులు బాగా వెనుకబడివుండటంతో వారిని ఏపీ ప్రభుత్వం బీసీల జాబితాలో చేర్చింది. 
 
ఆ తర్వాత కాపుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు, కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, అలా అనేక అంశాలపై ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఈ ఉద్యమానికి ఆయనే స్వయంగా నాయకత్వం వహించారు. ఈ క్రమంలో ఆయనపై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఆయన  చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనమైంది కూడా.
 
ఈ క్రమంలో కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన తెలిపారు. తనను కుల ద్రోహి, గజదొంగ వంటి వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన వాపోయారు.
 
కాపు ఉద్యమం ద్వారా తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని ముద్రగడ తెలిపారు. మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని చెప్పారు. తాను రోజుకో మాట మాట్లాడుతున్నానంటూ విమర్శిస్తున్నారని చెప్పారు. 
 
ఇప్పుడు బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం బాధేస్తోందని తెలిపారు. సందర్భానుసారంగా ఉద్యమం రూపురేఖలు మార్చుకుంటోందని, తన జాతికి ఏదో విధంగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు.