శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరోనా దెబ్బకు భయపడిన డోనాల్డ్ ట్రంప్.. తొలిసారి మాస్క్ ధరించిన ప్రెసిడెంట్

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ తొలిసారి కరోనా వైరస్ దెబ్బకు భయపడ్డారు. కరోనా వైరస్ సోకకుండా తాను మాస్క్ ధరించే ప్రసక్తే లేదని భీష్మించుకుని గత ఆర్నెల్లుగా కూర్చొన్న ట్రంప్.. ఎట్టకేలకు తొలిసారి ముఖానికి మాస్క్ ధరించారు. 
 
తాజాగా, ఓ ఆసుపత్రిలో కరోనా సోకి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన, ముఖానికి ఓ ముదురు రంగు మాస్క్‌ ధరించి కనిపించారు. ఆయనతో పాటు వచ్చిన వారంతా మాస్క్‌లను ధరించారు.
 
ఇక మాస్క్ విషయమై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా, ఆస్పత్రిలో మాస్క్ ధరించడం ఎంతో మంచిదని, సైనికులను పరామర్శిస్తున్న వేళ, తనకు సౌకర్యంగా అనిపించిందని అన్నారు. 
 
మాస్క్‌లను ధరించడాన్ని తానేమీ వ్యతిరేకించలేదని, అయితే, అందుకు సమయం, సందర్భం ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. కాగా, కరోనా కేసుల విషయంలో అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. 
 
కాగా, ప్రస్తుతం అమెరికాలో 3.29 మిలయన్ల కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 970వేల మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే, 137 వేల మంది మృత్యువాతపడ్డారు.