శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరోనాతో వ్యాపారమా? చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం : ట్రంప్ గర్జన

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైపోయింది. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఈ వైరస్ దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలైంది. దీంతో ఈ వైరస్ పురుడు పోసుకున్న చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కరోనా వైరస్‌ను చైనానే పుట్టించిందంటూ ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన టిక్ టాక్ యాప్‌ను నిషేధించే దిశగా అమెరికా యోచిస్తోంది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కరోనా అనేది పెద్ద వ్యాపారమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికి చైనా చేసిన పని చాలా అవమానకరమైనదని చెప్పారు. 
 
టిక్ టాక్‌ను నిషేధించే విషయంపై తమ పరిపాలనా విభాగం కసరత్తు చేస్తోందని తెలిపారు. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటామని... అందులో టిక్ టాక్‌ను నిషేధించడం కూడా ఒక మార్గమన్నారు. మరోవైపు, ఇప్పటికే టిక్ టాక్‌తో పాటు 59 యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే, చైనాపై హాంకాంగ్ దేశంలో ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ దేశం నుంచి టిక్ టాక్ స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించింది.