గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (09:35 IST)

జీవితంలో రాత్రులన్నీ వృథా అయిపోతున్నాయి... ఎన్నికల శిక్షణకు రాలేనన్న ఉపాధ్యాయుడు ... ఎక్కడ?

depression
ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లి కాలేదని, అందువల్ల తాను ఎన్నికల శిక్షణకు రాలేనని ఓ ఉపాధ్యాయుడు తెగేసి చెప్పాడు. దీంతో అతనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివారలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో అఖిలేశ్ కుమార్ అనే సంస్కృత ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయనకు వయసు 35 యేళ్లు. అయితే, కొన్నేళ్లుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం కాలేదు. దీంతో ఆయన విరక్తి చెందాడు. ఇదిలావుంటే, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల విధుల కోసం కొందరు ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు హాజరుకాలేనని తెగేసి చెప్పాడు. 
 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబరు 16, 17 తేదీల్లో ఎన్నికల విధులపై శిక్షణకు హాజరుకావాలని అధికారులు ఈయనను కోరారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా అఖిలేశ్ శిక్షణకు గైర్హాజరయ్యారు. దీనిపై అధికారులు షోకాజ్ నోటీసు పంపగా. 'నా జీవితంలో రాత్రులన్నీ వృథా అవుతున్నాయి. ఇప్పటికే 35 ఏళ్లు నిండాయి. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయమేస్తోంది. ముందు నన్ను పెళ్లి చేసుకోనివ్వండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తా' అని అక్టోబరు 31న అఖిలేశ్ బదులు ఇచ్చారు. 
 
రూ.3.5 లక్షల కట్నం, తను ఉంటున్న ప్రాంతంలో ఓ ఫ్లాటు కూడా కావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడి వైఖరికి విస్తుపోయిన జిల్లా కలెక్టరు నవంబరు 2న అఖిలేశ్‌కు సస్పెన్షను ఉత్తర్వులు పంపారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని, పెళ్లి కాలేదనే ఒత్తిడిలో ఉన్నట్లు తోటి ఉద్యోగి ఒకరు చెప్పారు.