శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

టెన్షన్ వద్దు.. మెజార్టీ నిరూపించుకుంటాం... సీఎం కమల్‌నాథ్

ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న హఠాత్పరిణామాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూల్‌గా సమాధానమిచ్చారు. తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పటికీ తన సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుకు వచ్చిన ముప్పేమి లేదన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో పాటు.. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించారు. దీంతో అత్తెసరు మార్కులతో నడుస్తున్న కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో కూరుకునిపోయింది. 
 
ఈ పరిణామాలపై ఆయన సీఎం స్పందిస్తూ, మధ్యప్రదేశ్‌‌లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమి లేదు. ప్రస్తుత పరిస్థితులపై బాధపడాల్సిన అవసరం లేదు. మేం తప్పకుండా మెజారిటీ నిరూపించుకుంటాం. మా ప్రభుత్వం పూర్తికాలం ప్రజలకు సేవలందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, కీలక నేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ చెంతకు చేరడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయిన విషయం తెల్సిందే. కాగా, మంగళవారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి 98 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 
 
అధికారం లేకుండా జీవించలేరు.. 
జ్యోతిరాదిత్యా సింధియా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిండని కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ... జ్యోతిరాదిత్య సింధియా వంటివారు అధికారం లేకుండా జీవించలేరన్నారు. అతడు ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదన్నారు. జాతీయ సంక్షోభ సమయంలో బీజేపీతో చేతులు కలపడం అంటే వ్యక్తి రాజకీయ స్వలాభాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.