1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:50 IST)

'కరోనా' సేవ చేస్తూ చనిపోతే అమరవీరుల హోదా : సీఎం నవీన్

దేశంలో కరోనా బారినపడిన దేశాల్లో ఒరిస్సా కూడా ఉంది. మంగళవారం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 74 మందికి సోకింది. ఒకరు మరణించారు. అయితే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒరిస్సా చాలా సేఫ్ జోన్‌లో ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నిస్తూ, కరోనా పాజిటివ్ రోగులకు సేవ చేసే సిబ్బంది మరణిస్తే వారికి అమరవీరుల హోదా కల్పిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. 
 
అలా మరణించిన సిబ్బందికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. వారి సేవలకు గుర్తింపుగా జాతీయ పండుగల రోజు అవార్డులు బహుకరిస్తామని సీఎం వెల్లడించారు. 
 
అంతేకాదు కరోనా కట్టడికి యత్నిస్తోన్న సిబ్బందికి 50 లక్షల రూపాయల చొప్పున బీమా చేయించినట్టు తెలిపారు. అదేసమయంలో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే వైద్యులు లేదా వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే, వైద్య సేవలకు అంతరాయం కలిగించే వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్.ఎస్.ఏ)ని ప్రయోగించి అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని గట్టివార్నింగ్ ఇచ్చారు.
 
వైద్య సిబ్బందిని గౌరవిద్ధాం.. పవన్ కళ్యాణ్ 
కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిపై దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. 'తమ పని తాము చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు సరికాదు. మనందరం ఇటువంటి పిరికి చర్యలను ఖండించాలి. అందరూ జనసేన నాయకులు, జనసైనికులు వైద్యులకు మద్దతుగా నిలబడండి' అని ట్వీట్ చేశారు.
 
కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సేవలందిస్తోన్న జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. 'జనసేన పార్టీ ఆఫీసు (హైదరాబాద్)లో పనిచేసే తూ.గో జిల్లా, పిఠాపురానికి చెందిన సంతోష్ దుర్గ తన రెండు నెలలు జీతాన్ని కరోనా కష్టకాలంలో పీఎం కేర్స్‌ ఫండ్‌కి విరాళం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు.
 
హిందూపురం నియోజకవర్గ పరిధిలో నిత్యం 200 మందికి అన్నదానం చేయడంతో పాటు వివిధ గ్రామాల్లో నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఆకుల ఉమేశ్‌కి పవన్‌ అభినందనలు తెలిపారు. 'హిందూపూరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు ఆకుల ఉమేష్‌కి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు' అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు.