1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (09:04 IST)

మిజోరం ఎన్నికలు : మొదలైన పోలింగ్ - అధికారం ఎవరికో?

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం రాష్ట్ర శాసనసభకు పోలింగ్ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 40 సీట్లు ఉన్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఫలింతగా బుధవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటింగ్ సాగుతోంది. పోటీలో మొత్తం 209 మంది అభ్యర్థులు ఉన్నారు. 
 
కాగా, మిజోరంలో మొత్తం 770395 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 394897 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పట్టుబడుతోంది. అదేసమయంలో వరుసగా మూడోసారి గెలిచి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉత్సుకతతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఫలితంగా పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. 
 
మిజోరంలో 1987 నుంచి కాంగ్రెస్, మిజోరం నేషనల్ పార్టీలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. దీంతో ఈ సారి అధికారాన్ని చేపట్టడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బ్రూ తెగల ఓటు హక్కు గురించి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగాయి. మిజోరానికి చెందిన బ్రూ తెగ వాళ్లు గతంలో త్రిపురకు వలస వెళ్లి అక్కడ ఉన్న తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. 
 
వీరి ఆందోళనల ఫలితంగా చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ను తొలిగించి, ఆశిశ్ కుంద్రాను నియమించింది. బ్రూ తెగకు చెందిన వాళ్లకు మిజోరం సరిహద్దు జిల్లా మమిత్‌లోని కాన్మున్ గ్రామంలో 15 తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.