1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (10:49 IST)

వయనాడు లోక్‌సభ ఉప పోరుకు ఈసీ కసరత్తులు

election commission of india
పరువు నష్టందావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జైలుశిక్ష పడటంతో ఆయన ఎంపీ పదవిపై కేంద్రం అనర్హత వేటు వేసింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌‍సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇపుడు ఆ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది.
 
మరోవైపు, ఈ స్థానానికి ఉప ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, రాష్ట్ర ఎన్నిక సంఘం అధికారులు మాత్రం ఈవీఎం, వీవీ ప్యాట్‍లను సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంల పనితీరును తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాక్ పోలింగ్ నిర్వహిస్తామని కోళికోడ్ డిప్యూటీ కలెక్టర్ వెల్లడించినప్పటికీ, ఆ తర్వాత మాక్ పోలింగ్‌ను కూడా నిర్వహించారు 
 
కాగా, పరువు నష్టం దావా కేసులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈసీ ఉప ఎన్నికకు సన్నాహాలు చేస్తుంది. మరోవైపు, ఉప ఎన్నికకు సిద్ధమవుతుండటంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఎన్నికల సంఘం చర్య వెనుక రహస్యం దాగి ఉందని ఆరోపించింది. 
 
ఈ కేసు విషయంలో రాహుల్ వేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా కోర్టు ఏం చెబుతుందో ఈసీ ఎలా అంచనా వేయగలదని ప్రశ్నించింది. వయనాడ్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు కనిపిస్తున్నాయని, ఇందులో ఏదో రహస్యం దాగి ఉందని అనుమానించాల్సిందేనని స్థానిక డీసీసీ అధ్యక్షుడు అన్నారు.