1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (10:20 IST)

పెళ్లికాకుండా సహజీవనం.. శిశువు జన్మించగానే బాత్రూమ్ కిటికీల నుంచి విసిరేసింది..

అక్రమ సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వివాహేతర సంబంధాలతో కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం ఓ పసికందు మృతికి కారణమైంది. పెళ్లికాకుండా సహజీవనం చేసి గర్భం దాల్చింది 22 ఏళ్ల మహిళ. ఓ రోజు పురిటినొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లగా బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బాత్రూంకి వెళ్లి కిటికీలోంచి ఆ బిడ్డను విసిరేసింది. దీంతో పసిబిడ్డ అక్కడిక్కడే మరణించింది. ఈ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. హెసరఘట్టకు చెందిన మహిళ (22), గుడేమారనహళ్లికి చెందిన శశాంక్‌ (27) ఇద్దరు ప్రేమించుకున్నారు. పట్టణంలో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ఆమెను శశాంక్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పండంటి బిడ్డను బయటకు తీశారు. అక్రమ సంబంధంతో పుట్టిన ఆ పాపను ఆమె బాత్రూంకి వెళ్లి కిటికీలోంచి కిందకు విసిరేసింది.
 
అక్కడ నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్‌ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమెను క్లినిక్‌లో చేర్చిన శశాంక్ విశ్రాంతి తీసుకోవడానికి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అతను తిరిగి ఆసుపత్రికి వస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తామిద్దరం ప్రేమించుకున్నామని పోలీసులకు తెలిపాడు.
 
తమకు పెళ్లి కాలేదు కావునా.. శిశువు పుట్టిన తర్వాత చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయం అంతా తమ తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందో అని భయపడి చెప్పలేదని అన్నారు. ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు డిశ్చార్జికాగానే అరెస్టు చేస్తామని తెలిపారు.