శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (15:17 IST)

తల్లి గర్భంలో వుండగానే ఆ ఆడశిశువు గర్భం దాల్చింది.. వైద్యులు షాక్!

వైద్యరంగంలో సంచలనం ఇజ్రాయెల్‌లో నమోదైంది. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులకు షాకిచ్చింది. ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం వైద్యులు గుర్తించారు. ఇలాంటివి చాలా అరుదుగా 10 లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఈ సంచలనం ఇజ్రాయెల్‌లోని ఆష్‌డోడ్‌ అనే పట్టణంలో నమోదైంది.
 
వివరాల్లోకి వెళితే, ఆష్‌డోడ్‌ పట్టణంలోని ఆస్సుటా మెడికల్‌ సెంటర్‌లో ఒక మహిళ ఆడ శిశువుకు ఈ నెల తొలి వారంలో జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయానికి ముందు గర్భిణికి ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలు జరిపిన వైద్యులు.. గర్భంలోని ఆడశిశువు పొట్టభాగం సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.
 
ప్రసవం అనంతరం చిన్నారికి ఆల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే పరీక్షలు జరిపిన వైద్యులు.. నవజాత శిశువు కడుపులో ఒకటికన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో వెంటనే నియోనాటాలజీ విభాగం డైరెక్టర్‌ ఓమర్‌ గ్లోబస్‌ నేతృత్వంలో చిన్నారికి సర్జరీ చేసి పలు పిండాలను బయటకు తీశారు.
 
శిశువు కడుపులో ఉన్న పిండాలు ఇప్పుడిప్పుడే రూపాలను సంతరించుకుంటున్నాయని, ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్‌ ఓమర్‌ గ్లోబస్‌ చెప్పారు. తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరో పిండం పోవడం వల్ల ఇలాంటివి వెలుగులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.