మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (16:57 IST)

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్.. చెరువులో నుంచి 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం!!

neet exam
జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతుంది. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌కు చెందిన నిందితుడు అవినాశ్ అలియాస్ బంటీకి చెందిన 16 మొబైల్ ఫోన్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కేసు విచారణ నిమిత్తం ఈ నెల 30వ తేదీ వరకు న్యాయస్థానం కస్టడీకి తీసుకుంది. 
 
అంతకుముందు ప్రాథమిక విచారణ సందర్భంగా కేసు గురించి బంటీ కీలక విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. పేపర్‌ లీక్‌కు ఉపయోగించిన 16 ఫోన్లను నిందితుడు చెరువులో పడేయగా టవర్‌ సిగ్నల్స్‌ ద్వారా ట్రాక్‌ చేసి రికవరీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పేపర్‌ లీక్‌లో అరెస్టయిన శశి పాసవాన్‌తో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
 
ఈ యేడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నీట్‌ ప్రశ్నపత్రాలు పొందేందుకు అభ్యర్థులు రూ.35 నుంచి 60 లక్షల వరకు చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బీహార్‌లోని కొందరు అభ్యర్థులు రూ.35 నుంచి రూ.45 లక్షలు, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.55 నుంచి రూ.60 లక్షలు చెల్లించి పేపర్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. పేపర్‌ లీక్‌ ఎక్కడ మొదలైంది.. ఎంతమంది విద్యార్థులకు చేరిందన్న వివరాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొనింది. అదేసమయంలో వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది.