శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (10:23 IST)

జైల్లో చిత్రహింసలు.. నాకు పిచ్చెక్కింది.. నిర్భయ దోషి కొత్త ఎత్తుగడ

నిర్భయ అత్యాచార కేసులో దోషిగా తేలిన ముద్దాయిల్లో ఓ ముద్దాయి సరికొత్త ఎత్తుగడ వేశారు. తీహార్ జైలు అధికారులు చిత్రహింసలకు గురిచేశారనీ, ఫలితంగా తనకు పిచ్చెక్కినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను మానసిక రోగంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ముద్దాయి పేరు వినయ్ శర్మ. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరుగనుంది. 
 
నిజానికి నిర్భయ దోషులకు జనవరి 22వ తేదీనే ఉరితీయాల్సివుంది. కానీ, వినయ్ శర్మే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరితీస్తారని భావించారు. కానీ, నలుగురు నిందితులు నాలుగు రకాలుగా మార్చిమార్చి పిటిషన్లు దాఖలు చేస్తూ ఊరిశిక్షలను అమలు కాకుండా సాగదీస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న ఉద్దేశంతో రాజ్యాంగం, చట్టం ప్రసాదించిన అవకాశాలను వినియోగించుకుంటూ దోషులు రోజుకో ఎత్తుగడతో కాలహరణం చేస్తూ వస్తున్నారు. 
 
తాజాగా వినయ్ శర్మ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 'నన్ను తీహార్‌ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఆ కారణంగా నాకు పిచ్చెక్కింది. మానసిక సమస్యతో నేను బాధపడుతున్నాను' అంటూ తాజాగా దోషి వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపాడు. ఈ కారణాన్ని చూపిస్తూ రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేశాడు. 
 
తన మానసిక వ్యాధిని దేశ ప్రథమ పౌరుడు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు పిటిషనర్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎటువంటి మానసిక సమస్యలు లేవని కేంద్రం కోర్టుకు తెలిపింది. కాగా, పిటిషన్‌ స్వీకరించి విచారించిన ధర్మాసనం తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది.