శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (09:53 IST)

నిర్భయ ముద్దాయిలకు టైమ్ దగ్గరపడింది... నేడు తేల్చనున్న ఢిల్లీకోర్టు

నిర్భయ దోషులకు టైమ్  దగ్గరపడినట్టు తెలుస్తోంది. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని తమకు అమలు చేయాల్సిన ఉరిశిక్షల నుంచి పదేపదే వాయిదా వేయించుకుంటూ వస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి జారీచేసిన డెత్ వారెంట్లపై స్టే విధించింది. దీన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుని స్టేకు వ్యతిరేకంగా కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నేడు ఆదివారం అయినప్పటికీ కోర్టు ప్రత్యేకంగా సమావేశమై విచారించనుంది.
 
నిజానికి నిర్భయ కేసులోని నలుగురు ముద్దాయిలను శనివారమే ఉరితీయాల్సివుంది. కానీ, ఓ దోషి పెట్టుకున్న పిటిషన్‌పై విచారించిన పటియాలా హౌస్ కోర్టు, ఉరిపై శుక్రవారం స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ హఠాత్పరిణామాన్ని తీవ్రంగా తీసుకున్న కేంద్రం, స్టేకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు అధికారులు, దోషులకు నోటీసులు జారీచేసింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను సెలవు దినమైనా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేపడతామని వెల్లడించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్భయ దోషుల భవితవ్యం తేలిపోనుంది. 
 
కాగా, నిర్భయ దోషులను తక్షణం ఉరితీయాలని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వీరికి శిక్ష అమలుపై తప్పు మీదంటే, మీదని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నలుగురికీ శిక్ష అమలు తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.