గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జులై 2023 (09:43 IST)

భర్తకు ఝులక్... ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ

rajastahan woman anju
ఇటీవల పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన భారతీయ ప్రియుడి కోసం తన నలుగురు పిల్లలను తీసుకుని పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ భారత్‌‍కు వచ్చింది. ఈ కలకలం ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమలో మరో అంతర్జాతీయ ప్రేమ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దఫా భారతీయ మహిళ ఒకరు తన పాకిస్థాన్ ప్రియుడి కోసం లాహోర్‌కు వెళ్లింది. ఈ మహిళను గుర్తించిన పాక్ పోలీసులు తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ ‌రాష్ట్రంలోని భివండీకి చెందిన అంజూ స్థానికంగా బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‍‌గా పనిచేస్తుంది. ఆమె భర్త అరవింద్ కూడా ప్రైవేటు ఉద్యోగి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజూ సోదరుడితో కలిసి వారు ఓ అపార్టుమెంట్లో ఉంటున్నారు. 
 
విదేశీ కొలువుల కోసం అంజూకు అరవింద్ 2020లో పాస్‌పోర్టు పొందడంలో సాయపడ్డాడు. అయితే, అంజూకు కొంత కాలం క్రితం ఫేస్‌బుక్‌లో పాక్‌లోని ఖైబర్ పాఖ్‌తూన్ ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నస్రుల్లాతో పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కాగా, గురువారం అంజూ జైపూర్ (రాజస్థాన్) చూడటానికి వెళుతుతున్నానని భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. 
 
ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోమారు భర్తకు ఫోన్ చేసి తాను లాహోర్‌లో ఉన్నట్టు చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు. రెండు మూడు రోజుల్లో తిరిగొస్తానని చెప్పి ఆమె సంభాషణ ముగించింది. అయితే, అంజూ ప్రేమ వ్యవహారం తనకు తెలుసునని అరవింద్ మీడియాకు తెలిపాడు. ఆమె మళ్లీ తన వద్దకు తిరిగొస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.