ఢిల్లీలో బెల్జియం యువతిపై ఓలా క్యాబ్ డ్రైవర్ పైశాచికత్వం.. అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల పైశాచికత్వం ఏమాత్రం తగ్గడం లేదు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కామాంధులు మాత్రం తమ వికృత చేష్టలకు పాల్పడుతూనే ఉన్నారు.
తాజాగా ఢిల్లీలో ఓలా క్యాబ్ డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో బెల్జియం యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
బెల్జియంకు చెందిన 23 ఏళ్ల యువతి గుడ్గావ్ నుంచి ఢిల్లీకి క్యాబ్ మాట్లాడుకుంది. బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత దారి తెలియడంలేదని, తనను ముందుకొచ్చి కూర్చోమని అసభ్యకరంగా ప్రవర్తించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
డ్రైవర్పై అనుమానంతో యువతి క్యాబ్లోంచి కిందకు దిగి నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి.. డ్రైవర్ రాజ్ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజ్సింగ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.