ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (11:57 IST)

రాత్రివేళ ప్రియురాలి కోసం వచ్చిన ప్రియుడు.. పట్టుకుని కొట్టి చంపిన తల్లిదండ్రులు

తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో గడిపేందుకు రాత్రివేళ వచ్చిన ఓ ప్రియుడుని ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు పట్టుకుని కట్టెలతో కొట్టి చంపేశారు. ఈ దారుణం నామక్కల్ జిల్లా పళ్లిపాళెయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పళ్లిపాళెంకు చెందిన కె.ధర్మరాజు (27) అనే వ్యక్తి ఆటోడ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలిక 9వతరగతితో చదువు మానేసి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. కులాలు వేరైనా ధర్మరాజు బాలికను ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించకుండా కలవవద్దని హెచ్చరిస్తూ వచ్చారు. 
 
ఇవేమీ పట్టించుకోని ధర్మరాజు తన ప్రియురాలి కోసం రాత్రి వెళల్లో ఆమె ఇంటికి వస్తూపోతున్నాడు. దీన్ని గమనించిన బాలిక తల్లితండ్రులు.. అతని కోసం మాటవేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన ధర్మరాజును అతన్ని పట్టుకొని కట్టెలతో కొట్టి చంపి, మృతదేహాన్ని బయట పడేశారు. 
 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కోపంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ధర్మరాజును హత్య చేసినట్లు తేలింది. నిందితులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మరాజు కుటుంబ సభ్యులు రోడ్డుపై శవంతో ధర్నాకు దిగారు. హత్య కేసు నమోదు చేశామని త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.