మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (08:59 IST)

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన : ప్రధాన సూత్రధారి ఝా లొంగుబాటు

lalith jha
తాజాగా పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటనకు సంబంధించిన ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఢిల్లీ నడిబొడ్డున కర్తవ్య పథ్ మార్గంలో వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు... ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక పోలీస్ విభాగానికి అప్పపగించింది. 
 
ఈ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి లలిత్ ఝా పరారీలో ఉండగా, ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. లలిత్ చివరిసారిగా కనిపించిన ప్రాంతం నీమ్రానా నుంచి బస్సులో ప్రయాణించి రాజస్థాన్‌లోని నాగౌర్‌కు వెళ్లినట్టు చెప్పాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక హోటల్లో బస చేశాడని, పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకొని తిరిగి వచ్చి లొంగిపోయానంటూ లలిత్ తెలిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, లలిత్ ఝా కోల్‌కతా నగరానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తేలింది. 
 
లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు అరెస్టయిన విషయం తెలిసిందే. లోక్‌సభలో కలకలం సృష్టించిన సాగర్ శర్మ, మనోరంజన్‌తోపాటు పార్లమెంట్ భవనం వెలుపల నినాదాలు చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు నలుగురు రంగుల పొగ డబ్బాలతో కలకలం రేపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాగర్, మనోరంజన్ లోక్‌సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి తీవ్ర కలకలం రేపాయి. వీడియోలను రికార్డు చేశారు. ఈ వీడియోలను సూత్రధారి లలిత్ ఝా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.