1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (12:55 IST)

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

boat sink
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. 17 మందితో వెళుతున్న పడవ ఒకటి గంగా నదిలో మునిగిపోయింది. బాధితుల్లో 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, మరో ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఆదివారం ఉదయం జరిగింది. పాట్నాకు సమీపంలోని బాఢ్ గ్రామం గంగానది ఒడ్డున ఉంది. గంగా దసరా పండుగ సందర్భంగా ఆదివారం పెద్ద సంఖ్యలో స్థానికులు నదీ తీరానికి వచ్చారు. నదీ స్నానం చేసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ ఎక్కారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ మునిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడగా, 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలినవారు నీళ్లలో మునిగిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. 
 
ఈ ప్రమాదం సమయంలో పడవలో మొత్తం 17 మంది ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరు.. నదిలో మునిగిపోయిన పడవలో సామర్థ్యానికి మించి అంటే దాదాపు 25 మంది వరకు ఉంటారని, ఈ కారణంగానే పడవ మునిగిపోయివుంటుందని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా గుర్తించలేకపోయారు.