గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (10:44 IST)

నా స్నేహితుడు ట్రంప్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. ప్రధాని మోడీ..

narendra modi
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. అలాగే, దేశంలోని అన్ని రాజకీయ పార్టీ నేతలతో పాటు.. పలు దేశాలకు చెందిన నేతలు కూడా ముక్తకంఠంతో ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా 'నా స్నేహితుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. 
 
కాంగ్రెస్ అగ్రనేత నేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, 'అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి చర్యలను అత్యంత కఠినంగా ఖండించాలి. ఆయన త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. 
 
అదేవిధంగా డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ స్పందిస్తూ, 'పెన్సిల్వేనియాలో జరిగిన అర్థరహిత హింసలో గాయపడిన నా తండ్రి ట్రంప్‌ సహా ఇతరుల కోసం ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. సీక్రెట్‌ సర్వీస్‌ సహా ఇతర సిబ్బంది వేగంగా స్పందించి తీసుకున్న చర్యలకు వారికి కృతజ్ఞతలు. ఈ దేశ క్షేమం కోసం మేం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం. లవ్‌ యూ డాడీ’’ - ఇవాంక, ట్రంప్‌ కుమార్తె
 
‘‘ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వానికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. అమెరికా ఇలాంటి కఠినమైన సమయాన్ని రూజ్‌వెల్ట్‌ సమయంలో ఎదుర్కొంది. సీక్రెట్‌ సర్వీస్‌ అసమర్థత లేదా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసి ఉండాలి. వారు వెంటనే రాజీనామా చేయాలి’’- ఎలాన్‌ మస్క్‌, వ్యాపారవేత్త