1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2015 (14:38 IST)

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి భారత ప్రధాని మోదీ పాదాభివందనం... ఆకాశానికెత్తేసిన అమెరికా

భారతదేశం-పాకిస్తాన్ దేశాల్లో ప్రజలకు ఒకరిపట్ల మరొకరికి ఆత్మీయతానురాగాలు పెంపొందించే ఘటనలు జరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా క్రిస్మస్ రోజునాడు పాకిస్తాన్ దేశంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌‍తో భేటీ కావడం ఇప్పుడు ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రజలకు తను పాక్ పర్యటనకు వెళ్తున్నట్లు మోదీ ట్విట్టర్ ద్వారా రెండు గంటల ముందు తెలియజేశారు. 
 
ఆయన పాకిస్తాన్ దేశంలో 80 నిమిషాలు గడుపగా అందులో 60 నిమిషాలు ఏకాంతంగా నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపారు. వారిరువురు మధ్య జరిగిన చర్చలు ఏమిటన్నది బయటకు రాలేదు. మోదీ తమ దేశానికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు పాక్ ప్రధాని విమానశ్రయంలో గంటపాటు వెయిట్ చేయటం విశేషం. అంతేకాదు, మోదీ తన పర్యటనను ముగించుకుని తిరిగి భారతదేశానికి వెళ్తున్న సమయంలోనూ షరీఫ్ స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి వీడ్కోలు పలికారు.
 
అంతకుముందు నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన తల్లికి మోదీ పాదాభివందనం చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే పెళ్లి కుమార్తె మెహ్రున్నీసాకు శుభాకాంక్షలు, షరీఫ్ కుటుంబ సభ్యుల్ని పలుకరించటం లాంటివి మోదీ అక్కడ చేయడం జరిగింది. అంతేకాదు... తన లాహోర్ పర్యటన అద్భుతంగా జరిగినట్లుగా పేర్కొన్న ప్రధాని, షరీఫ్ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిచినట్లుగా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కాగా తనతో పాటు వచ్చిన వంద మందికి పైగా ఉన్నవారిలో తనతో కేవలం 11 మందిని షరీఫ్ ఇంటికి తీసుకెళ్లారు. మిగిలినవారందరికీ విమానశ్రయంలో ప్రత్యేక మర్యాదలు చేసారు. మొత్తమ్మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఇరు దేశాల్లోనూ శాంతిని పెంపొందేచిదిగా ఉందంటూ అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రంచంలోని పలు దేశాలు కీర్తిస్తున్నాయి.