మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (10:10 IST)

మహారాష్ట్రలో జైలు టూరిజం

జైలు అనగానే నేరస్థుల శిక్షాస్థలం అనే అందరం అనుకుంటాం! కానీ జైళ్లు కూడా.. ఒకప్పటి భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్‌వారి కౌగిలిలో చిక్కిన భరతమాత సంకెళ్లను తెంచే ఆయుధాలుగా మారాయి. ప్రత్యేకించి యరవాడ జైలు గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆ జైలులోనే 1932లో పూనా ఒప్పందం జరిగింది.

దానిపై జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సంతకం చేశారు. అలాగే ఆరోజున మహాత్మాగాంధీ ఏ చెట్టు కింద కూర్చొని సంతకం చేశారో.. ఆ చెట్టు ఇప్పటికీ జైలు ప్రాంగణంలో అలాగే ఉంది. గాంధీజీ, బాలగంగాధర్‌తిలక్‌ శిక్ష అనుభవించిన జైలు వార్డులు కూడా నాటి స్వాతంత్య్ర సమరానికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.

పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ, మోతీలాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభారు పటేల్‌ కూడా అరెస్టయి ఈ జైలులోనే శిక్షననుభవించారు. చాపేకర్‌ సోదరుల ఉరితీత ఇక్కడే. అంతేకాదు.. 2008, ముంబయి అల్లర్లకు పాల్పడిన ఉగ్రవాది కసబ్‌ను ఈ జైలులోనే ఉరితీశారు.

ఈతరం విద్యార్థులకు జైలు గురించి, దాని ప్రాధాన్యత గురించి పెద్దగా తెలియడం లేదు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం యరవాడ జైలు గురించి ప్రత్యేకతను తెలియజేయాలనే ఉద్దేశంతో జైలు టూరిజంకు తలుపులు తెరిచింది.

ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే సందర్భంగా జైలు టూరిజాన్ని ప్రారంభించనుంది. దీనికి కేవలం రోజుకు యాబై మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అది కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి. జైలు పర్యటనకు వచ్చిన విద్యార్థులకు గైడ్‌లుగా జైలు సెక్యూరిటిగార్డులు వ్యవహరిస్తారు.