బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:07 IST)

పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ : తేల్చిన ఎన్.ఐ.ఏ

పుల్వామా ఉగ్రవాది వెనుక పాకిస్థాన్ హస్తమన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్‌తోపాటు కనీసం నలుగురైదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్లు సాక్ష్యాధారాలు లభించాయని ఎన్‌ఐఏ వెల్లడించింది. 
 
ఈ దాడిలో మారుతి ఈకో వాహనాన్ని వాడారు. ఈ వాహనం యజమానిని కూడా విచారణాధికారులు గుర్తించారు. ఈ వాహనం 8 ఏళ్ల కిందట కాశ్మీర్‌లోనే రిజిస్టర్ అయింది. ఉగ్రవాదుల తన వాహనాన్ని వాడుతున్నట్లు వాహన యజమానికి కూడా తెలుసుని వాళ్లు స్పష్టంచేశారు. దాడి జరిగిన తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ దాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. 
 
దాడికోసం వాహనంలో 25 కిలోల ఆర్డీఎక్స్‌ను నింపినట్లు తేలింది. ఈ ఆర్డీఎక్స్ జేఈఎం ఉగ్రవాదులకు ఎలా చేరిందన్నదానిపై విచారణ ఇంకా కొనసాగుతున్నది. సరిహద్దు అవతలి నుంచే ఈ ఆర్డీఎక్స్ వచ్చినట్లు విచారణాధికారులు అనుమానిస్తున్నారు. 
 
గతేడాది మార్చిలో కనిపించకుండా పోయిన అహ్మద్ దార్ అప్పటి నుంచీ జైషేతోనే ఉన్నాడనీ ఎన్‌ఐఏ తేల్చింది. గతేడాది జూన్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు తన ఇంటిని తగులబెట్టడానికి ప్రయత్నించినప్పటి నుంచీ ఆదిల్ అహ్మద్ దార్ వాళ్లపై కక్ష పెంచుకున్నట్లు కూడా విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన వెంటనే జూన్ 2న భద్రతా బలగాలపై జైషే ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడులకు పాల్పడ్డారు. దీనికి ఆపరేషన్ బదర్ అనే పేరు కూడా పెట్టారు.