1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జులై 2025 (19:06 IST)

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

currency note
కూలీకి ఆరు రూపాయలతో కోటి రూపాయల అదృష్టం వరించింది. ఆరు రూపాయలు పెట్టి టిక్కెట్ కొంటే ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది. పంజాబ్ రాష్ట్రంలోని మెగా జిల్లాకు రోజువారీ కూలీ జాస్మాయిల్‍ సింగ్‍కు అదృష్టం వరించింది. బట్టీలో సేల్స్ మ్యాన్‌గా పనిచేస్తున్న జాస్మాయిల్, ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని జిరాను వెళ్లినప్పుడు ఈ లక్కీ టికెట్లు కొనుగోలు చేశాడు. అలా కొనుగోలు చేసిన కొన్ని గంటల తర్వాత అతనికి జీవితాన్ని మార్చే ఫోన్ కాల్ వచ్చింది. 
 
'శర్మ జీ ఫోన్ చేసి, 'మీ నంబర్ చెక్ చేసుకోండి. మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు' అని అన్నారు. నేను నమ్మలేకపోయాను," అని జాస్మాయిల్ వివరించాడు. ఈ వారం ప్రారంభంలో తీసిన లక్కీ డ్రాలో అతను కొనుగోలు చేసిన 50E42140 నంబర్ గల టికెట్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది. 
 
ఇక, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన జాస్మాయిల్, అతని కుటుంబం తమ గ్రామంలో స్వీట్లు పంచి పెట్టి, డ్రమ్స్ వాయిస్తూ, నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. "వచ్చిన డబ్బులో నేను రూ.25 లక్షలు అప్పు చెల్లించడానికి ఉపయోగిస్తాను. మిగిలిన డబ్బును నా పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటాను" అని జాస్మాయిల్ సింగ్ తెలిపారు. 
 
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలతో సహా తన ముగ్గురు పిల్లల విద్య, శ్రేయస్సు కోసం వినియోగిస్తానని ఆయన చెప్పారు. అతని భార్య వీర్‌పాల్ కౌర్ కూడా అంతే ఆనందాన్ని వ్యక్తం చేసింది. "ఈ రోజు మేము ఎప్పుడూ ఊహించలేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మేము మా పిల్లలకు వారు కోరుకున్న జీవితాన్ని అందించగలం" అని అన్నారు.