గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (15:09 IST)

దేశంలో కరోనా ప్రళయం .. రద్దవుతున్న రైళ్లు.. తాజాగా.

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అనేక మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్డౌన్‌ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలువుతున్నాయి. 
 
అలాగే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ పరీక్ష సర్టిఫికెట్‌ చూపాలని చెబుతున్నాయి. దీంతో ఈ ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. ఫలితంగా ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున సర్వీసులను రైల్వేశాఖ రద్దు చేసింది. 
 
తాజాగా దురంతో, రాజధాని, శతాబ్ది, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సంబంధిత రైళ్లు ఈ నెల 9 నుంచి అందుబాటులో ఉండవని.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైళ్లు నడవవని నార్త్‌ రైల్వేశాఖ తెలిపింది. విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించింది.
 
వణికిపోతున్న ప్రయాణికులు.. 
 
కరోనా నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో 28 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. ఈ రైళ్ళ రద్దు శుక్రవారం అమల్లోకి వచ్చింది. రద్దు అయిన రైళ్లలో శుక్రవారం నడవాల్సిన తిరుపతి-విశాఖపట్టణం, సికింద్రాబాద్-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-రేణిగుంట, విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-గూడూరు, నాందేడ్-జమ్ముతావి, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, నర్సాపూర్-నాగర్‌సోల్, సికింద్రాబాద్-విజయవాడ, విజయవాడ-సికింద్రాబాద్, హైదరాబాద్-సిర్పూరు కాగజ్‌నగర్, సిర్పూరు కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.  
 
అలాగే, శనివారం నడవాల్సిన విశాఖ-తిరుపతి, రేణిగుంట-కాకినాడ టౌన్, లింగంపల్లి-విజయవాడ, తిరుపతి-కరీంనగర్, గూడూరు-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్టణం, సిర్పూరు కాగజ్‌నగర్-సికింద్రాబాద్, నాగర్‌సోల్-నర్సాపూర్ రైళ్లు, 9న నడిచే కాకినాడ టౌన్-లింగంపల్లి, కరీంనగర్-తిరుపతి, జమ్ముతావి-నాందేడ్, విశాఖపట్టణం-సికింద్రాబాద్, 10న నడిచే లింగంపల్లి -కాకినాడ టౌన్ రైళ్లు ఉన్నాయి.