శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (12:51 IST)

భారత్ బంద్ : స్తంభించిన ఉత్తరం.. ప్రభావం లేని దక్షిణం

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలు, జాతీయ బ్యాంకులు, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ శుక్రవారం ప్రశాంతంగా సాగుతోంది. ఈ బంద్ ప్రభావం ఉత్తర భారతంపై ఎక్కువగా కనిపించగా, దక్షిణాదిలో పెద్దగా లేదు. 
 
ముఖ్యంగా, కేంద్రం తీసుకొచ్చిన ఈ సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘాల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు... ఈ భారత్ బంద్ చేపట్టారు. ఉదయం ఆరు గంటలకు మొదలైన ఈ బంద్‌ నేపథ్యంలో ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో రవాణా స్తంభించింది. రైతు మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు.
 
ఢిల్లీ - ఉత్తరప్రదేశ్‌ను కలిపే ఘాజిపూర్‌ సరిహద్దు వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై నృత్యాలు చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో 24వ నంబరు జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంద్‌ దృష్ట్యా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు నిలిపివేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 
 
అటు పంజాబ్‌, హర్యానాల్లోనూ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అమృత్‌సర్‌లో రైతు మద్దతుదారులు రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్‌ నేపథ్యంలో నాలుగు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. పంజాబ్‌, హరియాణాలోని 32 ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది.
 
అలాగే, భారత్‌ బంద్‌ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌ సరిహద్దుల్లో భద్రతాబలగాలను భారీగా మోహరించారు. 
 
రద్దీ ప్రదేశాల్లో గస్తీ‌ నిర్వహించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా రైతు సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ సాగనుంది.
 
రైతులు చేపట్టిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మద్దతు పలికారు. ‘‘సత్యాగ్రహాలతో దాడులు, అన్యాయం, అహంకారాన్ని అంతం చేయొచ్చని దేశ చరిత్ర చెబుతోంది. నేడు జాతిహితం కోసం రైతులు చేపట్టిన ఆందోళన శాంతియుతంగా కొనసాగాలి’’ అని రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు.