ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (08:45 IST)

దేశ వ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు

దేశ వ్యాప్తంగా భారత 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఇతర రాష్ట్రాల్లో ఈ వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకలకు అతిథిలు మాత్రమే హాజరయ్యేలా ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్ మరోమారు తన సైనిక సంపత్తిని ప్రదర్శించింది. 
 
మరోవైపు, అత్యంత చల్లని ఉష్ణోగ్రతల మధ్య ఇండో - టిబెటన్ సరిహద్దుల్లో పోలీసులు రిపబ్లిక్ వేడుకలు నిర్వహించారు. 1500 అడుగులు ఎత్తులో మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జవాన్లు జాతీయ జెండాతో కవాతు నిర్వహించారు. జవాన్లు జాతీయ జెండాను రెపరెపలాపడించారు 
 
అదేవిధంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ దృష్ట్యా గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్ నుంచి రాజ్‌భవన్‌కు మార్చారు. 
 
అదేవిధంగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ రాజ్యాంగాల్లో మనది అతిపెద్దది, అత్యుత్తమైనది అని గుర్తుచేశారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరకీ తప్పనిసరి అని పేర్కొన్నారు. మనది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశం అంటూ కొనియాడారు.