బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (14:52 IST)

పీఆర్సీ జీవో రద్దు చేసేవరకు చర్చల్లేవ్ : ఏపీ ఉద్యోగుల పీఆర్సీ సాధన సమితి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలు రద్దు చేసేంతవరకు మంత్రులత కమిటీతో చర్చలకు వెళ్లే ప్రసకతే లేదని నాలుగు ప్రధాన ఉద్యోగసంఘాలకు పీఆర్సీ సాధన సమితి నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులక కమిటీ చట్టబద్ధత ఏంటో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
ఏపీ ప్రభుత్వం జారీచేసిన కొత్త పీఆర్సీ వల్ల వేతనాలు తగ్గుతున్నాయని, అందువల్ల తమకు పాత వేతనాలే ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాటపట్టారు. తమకు పాత జీతాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు దశల వారీగా వివిధ రకాలైన ఆందోళనలు చేపట్టి ఏడో తేదీ నుంచి సమ్మెను ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ అర్థరాత్రి నుంచి ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగాల సంఘాలన్నీ సమ్మెకు వెళ్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్లకూడదని ప్రభుత్వ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. పీఆర్సీ జీవోలను రద్దుతో పాటు అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, అలాగే, పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని వీటికి సమ్మతిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, పీఆర్సీపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు సాధన సమితి నేతలైన బండి శ్రీనివాస్, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామి రెడ్డిలు తెలిపారు.