మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:31 IST)

సనాతన ధర్మం ఒక హెచ్.ఐ.వి రుగ్మత వంటిది : డీఎంకే నేత ఏ.రాజా

araja
సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఇపుడు డీఎంకేకు చెందిన సీనియర్ నేత ఏ.రాజా మరింత తీవ్రంగా వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని హెచ్.ఐ.వి.తో పోల్చారు. ఇదో సామాజిక రుగ్మత అని విమర్శించారు. 
 
మంత్రి ఉదయనిధి స్టాలిన్ మలేరియా, డెంగీతో పోల్చితే, ఈ కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా హెచ్ఐవీతో పోల్చడం గమనార్హం. అంతేకాదు, సనాతన ధర్మంపై చర్చకు అనుమతిస్తే.. సమాధానాలు ఇవ్వడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.
 
సనాతన ధర్మ సూత్రాల వల్ల అందరికీ సమాన అవకాశాలు లభించడం లేదని.. సమాజంలో ఇదో హెచ్ఐవీ వంటిందన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ముందు మీ పార్టీలో సమానత్వం పాటించి ఆ తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. కులాలు వద్దంటూ తమిళనాడులో కుల ఆధారిత రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారని డీఎంకే నేతను నిలదీశారు.
 
'ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను అనుమతిస్తే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నిర్ణయించిన తర్వాత 'సనాతన ధర్మం' ఏది అని నేను వివరిస్తాను' అని రాజా అన్నారు. పుదుచ్చేరిలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. దీనిపై అమిత్ షా లేదా ఇతర బీజేపీ ముఖ్య నేతలు ఎవరైనా తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.