శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (23:02 IST)

శశికళ వస్తోందని సీఎం పళనిస్వామి తన పర్యటనను రద్దు చేసుకున్నారా?

ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ తమిళనాడు ఎన్నికల గురించే. నాలుగు సంవత్సరాల పాటు సైలెంట్‌గా ఉన్న పళణిస్వామి, పన్నీరు సెల్వంలు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడిపోయారు. ఉపద్రవం ముంచుకొస్తున్న వేళ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
 
పన్నీరు సెల్వం విషయాన్ని పక్కనబెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే శశికళ ఉన్నప్పుడే ఆమెను వ్యతిరేకించాడు పన్నీరుసెల్వం. దీంతో ఆమె తాను నమ్మిన బంటు పళణిస్వామిని సిఎంను చేసింది. కానీ కొన్నిరోజుల పాటు శశికళకు విధేయుడిగా ఉన్న పళణిస్వామి పన్నీరుసెల్వంకు దగ్గరయ్యాడు.
 
ఇదంతా కొన్నినెలల క్రితమే జరిగింది. ఇద్దరూ కలిసి సిఎం, డిప్యూటీ సిఎంలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు పళణిస్వామికి భయం పట్టుకుంది. శశికళ రేపు బెంగుళూరు నుంచి చెన్నైకి రావాలనుకున్నారు. కానీ ఆదివారం రోజు రాకూడదని జ్యోతిష్యుడు సలహా ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గారు.
 
సోమవారం చెన్నైకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సోమవారం పళణిస్వామి తన ఎన్నికల ప్రచారాన్ని తిరువళ్ళూరు నుంచి ప్రారంభించాల్సి ఉంది. మే నెలలో తమిళనాడు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పళణిస్వామి తిరువళ్ళూరు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనుకున్నారు.
 
కానీ బెంగుళూరు నుంచి చెన్నైకు వెళ్ళాలంటే శశికళ తిరువళ్ళూరు మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో చివరకు తన పర్యటనను రద్దు చేసుకున్నారు పళణిస్వామి. శశికళకు ఎదురెళ్ళి ప్రచారం చేసే ధైర్యం లేక పళణిస్వామి తన పర్యటనను రద్దు చేసుకున్నాడంటూ శశికళ వర్గీయులు చెబుతున్నారు.