1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (19:56 IST)

వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయలేకపోతే ఉరేసుకోమంటారా? కేంద్ర మంత్రి

కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడంలోనూ, దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందజేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర మంత్రులు నిగ్రహం కోల్పోతున్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ కొరతపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ తీవ్ర స్థాయిలో స్పందించారు. కోర్టులు ఆదేశించిన పరిమాణంలో వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేకపోతే పాలకులు ఉరేసుకోవాలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ అందాలని కోర్టు చెప్పడం మంచి ఆలోచనే. అయితే రేపు అదే కోర్టు పలానా సంఖ్యలో వ్యాక్సీన్లు ఇవ్వాలంటూ చెబితే... అన్ని వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేనందుకు మేము ఉరేసుకోవాలా?' అని మంత్రి ఆక్రోశం వెళ్లగక్కారు.\\
 
వ్యాక్సీన్ పంపిణీపై ప్రభుత్వానికి ఓ కార్యాచరణ ప్రణాళిక ఉండాలనీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాలన్నారు. అక్కడక్కడా వ్యాక్సీన్లు కొరత ఏర్పడటం వాస్తవమే అయినప్పటికీ... వాక్సీన్ల పంపిణీ కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా, నిజాయితీగా పనిచేస్తోందని సదానంద పేర్కొన్నారు. 
 
'ఆచరణలో కొన్ని విషయాలు మన పరిధికి ఆవల ఉంటాయి. వాటిని మనం అదుపు చేయగలమా?' అని ఆయన ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వ్యాక్సీనేషన్ ప్రక్రియకోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందనీ.. కొద్దిరోజుల్లో వ్యాక్సినేషన్ పరిస్థితి మెరుగుపడుతుందని సదానంద ఆశాభావం వ్యక్తం చేశారు.